ఏపీలో హైఅలర్ట్: 12 గంటల్లో 60 కరోనా కేసులు.. కర్నూలులో హైటెన్షన్

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (కోవిడ్ 19) పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. శనివారం రాత్రి వరకు 192గా ఉన్న కరోనా కేసులు ఒక్కసారిగా 60 కేసులు పెరిగి 252కు చేరుకున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. ఈ కేసుల్లో కూడా ఎక్కువ ఢిల్లీ ప్రార్థనకు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. రాష్ట్రంలో శనివారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 9 వరకు నమోదైన కోవిడ్ పరీక్షల్లో కొత్తగా ఒంగోలులో 2, చిత్తూరులో 7, కర్నూలులో 23, నెల్లూరులో 2 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు నమోదైన కోవిడ్19 పరీక్షల్లో కర్నూలులో కొత్తగా 26 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 252కి పెరిగిందికర్నూలులో గత 12 గంటల ముందు వరకు నాలుగుగా ఉన్న కరోనా వైరస్ కేసులు ఒక్క సారిగా 53కు చేరుకున్నాయి. కరోనా సోకిన బాధితులందరూ ఢిల్లీలోని నిజాముద్దీన్ జమాత్‌కు వెళ్లి వచ్చిన వారిగా తెలుస్తోంది. కర్నూలులో ఒకేరోజు 49 కేసులు పెరిగాయి. అలాగే నెల్లూరు, గుంటూరులో సైతం భారీగా కేసులు పెరుగుతున్నాయి. కర్నూలులో అత్యధికంగా 53 కేసులు నమోదు కాగా, నెల్లూరులో 34 కేసులతో రెండో స్థానంలోనూ, గుంటూరు జిల్లా 30 కేసులతో మూడో స్థానంలో. కృష్ణా జిల్లా 28 కరోనా కేసులతో నాలుగో స్థానంలో నిలిచాయి.అలాగే రాష్ట్రంలో కరోనా పాజిటివ్ నిర్ధారించిన బాధితుల నివాస స్థలాలను ప్రభుత్వం ప్రకటించింది. బాధితులందరినీ ఐసొలేషన్‌లో ఉంచినట్లు ప్రకటించింది. అలాగే కరోనా బాధితులతో కాంటాక్ట్ అయిన వారందరినీ క్వారంటైన్‌కు తరలించినట్లు వెల్లడించింది. కరోనా పాజిటివ్ వచ్చిన బాధితులకు సంబంధించిన కొందరి నివాస స్థలాలను ప్రభుత్వం వివరించింది. బాధితుల వివరాలు తెలుసుకుని, ఆయా ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసే ప్రక్రియలో భాగంగానే బాధితుల వివరాలను ప్రభుత్వం ప్రకటించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన వివరాల్లో బాధితుడి పేరు పేర్కొనకుండా కరోనా సోకిన వ్యక్తి జిల్లా, నివాస ప్రాంతం, వయసు, జెండర్, కరోనా ఎలా సోకింది, ఎప్పుడు సోకింది అనే వివరాలు పొందుపరిచింది.